Chandrababu: గోరంట్ల మాధవ్ క్లిప్పింగ్ వేసి చూపించిన చంద్రబాబు

  • నాడు కియా ప్రతినిధితో ఎంపీ వాగ్వాదం!
  • ఉద్యోగాలు తమకే ఇవ్వాలని ఎంపీ కోరినట్టు మీడియాలో కథనాలు
  • ఇలా చేస్తే కంపెనీలు వస్తాయా? అని చంద్రబాబు ఆవేదన

దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ అనంతపురం జిల్లాలోని తన ప్లాంట్ ను తమిళనాడుకు తరలిస్తోందన్న ప్రచారం ఊపందుకుంది. దీనిపై 'రాయిటర్స్' వంటి అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం వెలువరించడంతో ఊహాగానాలకు బలం చేకూరింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు.

తాము కియాను ఏపీకి ఆహ్వానించిన సమయంలో వైఎస్ జగన్ అనంతపురం వెళ్లి అక్కడి రైతులను భూములు ఇవ్వొద్దని చెప్పాడని, నష్టం వస్తుందని చెప్పి తిరుగుబాటు చేయాలని రెచ్చగొట్టాడని ఆరోపించారు. కానీ అక్కడి రైతులు విజ్ఞతతో ఆలోచించి తమ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ముందుకుపోయారని తెలిపారు.

ఆ తర్వాత కియా ప్లాంట్ ఏర్పాటు తర్వాత ఓ ఎంపీ (గోరంట్ల మాధవ్) కంపెనీ సీఈవోను వేలెత్తి చూపుతూ మాట్లాడాడని, ఇలా చేస్తే ఎవరైనా వస్తారా? అంటూ ప్రశ్నించారు. "ఇక్కడి భూములు మావి, ఇక్కడి నీళ్లు మావి, ఉద్యోగాలు కూడా మాకే ఇవ్వాలని బెదిరించారు. ఓ అంతర్జాతీయ సంస్థను ఈ విధంగా బెదిరిస్తారా? మరో నాయకుడు, తమ లారీలనే అద్దెకు తీసుకోవాలని అన్నాడు. మీరు లక్షలకు లక్షలు సంపాదిస్తుంటే మేం చూస్తూ ఊరుకోవాలా? అన్నాడు. మేం చెప్పింది వినాల్సిందే అని హుకుం చేశాడు" అంటూ పలు క్లిప్పింగ్స్ వేసి మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు.

More Telugu News