AP Legislative Council: రెండు సెలెక్ట్ కమిటీలను నియమించిన ఏపీ శాసనమండలి

  • సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీ చైర్మన్ గా బొత్స
  • వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీ చైర్మన్ గా బుగ్గన
  • వికేంద్రీకరణ బిల్లుకు చెందిన సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా ఉండమన్న వైసీపీ

సీఆర్డీఏ రద్దు బిల్లు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఏపీ శాసనమండలి రెండు సెలెక్ట్ కమిటీలను నియమించింది. మండలి చైర్మన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీ చైర్మన్ గా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా టీడీపీ నుంచి దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు, వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, బీజేపీ నుంచి సోము వీర్రాజు, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు ఉన్నారు.

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించిన సెలెక్ట్ కమిటీ చైర్మన్ గా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సభ్యులుగా టీడీపీ నుంచి నారా లోకేశ్, తిప్పేస్వామి, అశోక్ బాబు, సంధ్యారాణి, బీజేపీ నుంచి మాధవ్, వేణుగోపాల్ రెడ్డి, పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు ఉన్నారు.

వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించిన సెలెక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని తాము భాగస్వామ్యం కాబోమంటూ మండలి చైర్మన్ షరీఫ్ కు  వైసీపీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి లేఖ రాశారు. కాగా, సెలెక్ట్ కమిటీల ఏర్పాటు గడువు నిన్నటితో ముగిసింది. ఇప్పటికే ఆయా పార్టీలు లేఖలు సమర్పించడంతో రెండు సెలెక్ట్ కమిటీలను చైర్మన్ షరీఫ్ నియమించారు.

More Telugu News