Narendra Modi: మహాత్మాగాంధీ మీకు ట్రైలర్ కావచ్చు.. మాకు జీవితం: ప్రతిపక్షాలకు మోదీ చురక

  • అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలపై లోక్ సభలో విపక్ష సభ్యుల ఆందోళన
  • ఇంకా ఏమైనా ఉందా? అని ప్రశ్నించిన మోదీ
  • మహాత్మాగాంధీ అమర్ రహే అంటూ నినదించిన ప్రధాని

మహాత్మాగాంధీపై విమర్శలు గుప్పించారంటూ బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డేకు వ్యతిరేకంగా లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ లేచి నిల్చుని... అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. 'మహాత్మాగాంధీ అమర్ రహే' అంటూ నినదించారు. మోదీ ఈ మేరకు స్పందించిన కొన్ని నిమిషాల తర్వాత లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదురి మాట్లాడుతూ, ఇది ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. వెంటనే మోదీ కల్పించుకుని... ఇది మీకు ట్రైలర్ మాత్రమే కావచ్చు... మాకు మాత్రం మహాత్మాగాంధీ అంటే ఒక జీవితం అని చెప్పారు.

గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం గురించి మోదీ మాట్లాడుతూ... తాము కూడా మీలాగే పని చేసిన ఉంటే ఎలాంటి మార్పు ఉండేది కాదని చెప్పారు. కానీ ప్రజలు ఒక సమూలమైన మార్పును కోరుకున్నారని అన్నారు.

ఈ వారం ప్రారంభంలో అనంతకుమార్ హెగ్డే మహాత్మాగాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ చేసిన స్వాతంత్ర్య పోరాటం ఒక డ్రామా అని అన్నారు. గాంధీ పోరాటానికి సంబంధించిన చరిత్ర పుస్తకాలను చదువుతుంటే తనకు రక్తం మరిగిపోతోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి.

More Telugu News