Buggana Rajendranath: కియా సంస్థ, విశాఖలపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: ఏపీ మంత్రి బుగ్గన

  • కియా మోటార్స్‌ తమిళనాడుకు తరలిపోతుందంటూ ప్రచారం
  • విశాఖపట్నంలో మిలీనియం టవర్స్‌పై అసత్య ప్రచారం
  • ఈ ప్రచారం దురుద్దేశంతో కూడుకుంది
  • సోషల్ మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయి

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ కియా మోటార్స్‌ అనంతపురం నుంచి తమిళనాడుకు తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన కథనంపై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ మండిపడ్డారు. అలాగే, విశాఖపట్నంలో మిలీనియం టవర్స్‌ను ఖాళీ చేయాలని ఆదేశించినట్లు కూడా కథనాలు వచ్చాయని, అయితే దీనిపై అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి లిఖిత పూర్వక లావాదేవీలు జరగలేదని చెప్పారు.

ఈ ప్రచారం దురుద్దేశంతో కూడుకున్నట్లుగా ఉందని, తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని బుగ్గన తెలిపారు. సోషల్ మీడియాలో కూడా చాలా కథనాలు వచ్చాయని, ఆ కథనాలన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని చెప్పారు.

కియా పరిశ్రమ కూడా ఆ వార్తలను తోసిపుచ్చిందని బుగ్గన తెలిపారు. 'మా ప్రభుత్వం వచ్చాక పరిశ్రమ రంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రభుత్వం ఏర్పడిన 7 నెలలకే అన్ని అభివృద్ధి పనులు జరిగిపోవాలంటే ఎలా? చంద్రబాబు ఆయన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి. 2019 జూన్ నుంచి రూ.15,600 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయినప్పటికీ మేము దీనిపై చంద్రబాబులా ప్రచారం చేసుకోవట్లేదు' అని బుగ్గన చెప్పారు.

More Telugu News