Tejasvi Surya: మరోసారి మొఘలుల పాలన రావడానికి ఎంతో సమయం పట్టదు: తేజశ్వి సూర్య

  • దశాబ్దాలుగా పరిష్కారం కాని వాటిని మోదీ పరిష్కరించారు
  • గతంలో తగిలిన దెబ్బలను నయం చేయకుండా సరికొత్త భారత్ ను నిర్మించలేము
  • సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని లాగేసుకోవడానికి కాదు

ప్రజలంతా అప్రమత్తంగా లేకపోతే మన దేశంలో మొఘలుల పరిపాలన మరోసారి రావడానికి మరెంతో సమయం పట్టదని దక్షిణ బెంగళూరు బీజేపీ ఎంపీ తేజశ్వి సూర్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా లోక్ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలోని షహీన్ బాగ్ లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలను మోదీ పరిష్కరించారని కొనియాడారు. గతంలో తగిలిన దెబ్బలను నయం చేయకుండా... సరికొత్త భారత్ ను నిర్మించలేమని చెప్పారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ల నుంచి కాందిశీకులుగా వచ్చిన మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించేందుకే సీఏఏను తీసుకొచ్చారని... ఎవరి పౌరసత్వాన్ని లాగేసుకోవడానికి మాత్రం కాదని తేజశ్వి అన్నారు. మోదీ నాయకత్వంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, బోడో సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు.

More Telugu News