Kerala: మంచినీటి కుళాయిలు తిప్పితే మద్యం వచ్చింది... ఎలాగంటే..!

  • ఓ బార్లో 6 వేల లీటర్ల అక్రమమద్యం పట్టుకున్న అధికారులు
  • కోర్టు ఆదేశాలతో అక్రమ మద్యం గుంతలో పోసిన అధికార గణం
  • ఆ మద్యం ఇంకిపోయి భూగర్భ జలాలతో కలిసిన వైనం
  • బోర్ల ద్వారా కుళాయిల్లోకి మద్యం కలిసి నీరు సరఫరా

కేరళలో ఆసక్తికరమైన ఘటన జరిగింది. త్రిస్సూర్ జిల్లా చాలక్కుడిలో ఓ అపార్ట్ మెంట్ లో మంచినీటి కుళాయిలు తిప్పితే మద్యం వచ్చింది. కుళాయి నీటి నుంచి లిక్కర్ వాసన రావడంతో అపార్ట్ మెంట్ వాసులు అవాక్కయ్యారు. అసలు విషయం తెలిసిన తర్వాత విస్మయానికి గురయ్యారు.

చాలక్కుడిలోని సాల్మన్స్ ఎవెన్యూ అపార్ట్ మెంట్ పక్కనే ఆరేళ్ల కిందట 'రచన' పేరిట ఓ బార్ ఉండేది. ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో ఆ రచన బార్లో అక్రమ మద్యం నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. సుమారు 6000 లీటర్ల మేర అక్రమ మద్యాన్ని గుర్తించిన అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆ మద్యం సీసాలను ధ్వంసం చేశారు. బార్ పక్కనే గుంత తవ్వి ఆ మద్యాన్నంతా అందులో పోశారు. అది క్రమంగా భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలతో కలిసిపోయింది. ఆ నీరే బోర్ల ద్వారా అపార్ట్ మెంట్ ట్యాంకుల్లోకి చేరినట్టు తెలుసుకున్నారు. ఈ కారణంగానే నీరు ఆల్కహాల్ వాసన వస్తోందని గుర్తించారు.

దాంతో, మండిపడిన అపార్ట్ మెంట్ వాసులు ఎక్సైజ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్, శానిటరీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News