New Delhi: ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌ ఏర్పాటు: పార్లమెంటులో ప్రకటించిన నరేంద్రమోదీ

  • ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోనే మందిర నిర్మాణం
  • నిర్మాణం విషయంలో పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుంది
  • కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయమని వెల్లడి

అయోధ్యలో ప్రతిష్ఠాత్మక రామ మందిర నిర్మాణం కోసం ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ప్రత్యేక ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులో ప్రకటించారు. ఇందుకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపినట్లు వివరించారు. అయోధ్య వివాదంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు రామలల్లాకే ఈ భూమి చెందుతుందని మూడు నెలల క్రితం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధాని పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయానికి ముందు కీలక ప్రకటన చేయడం గమనార్హం. ‘సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేబినెట్‌లో చర్చించి ట్రస్ట్‌ ఏర్పాటు చేశాం. మందిర నిర్మాణంలో ఈ ట్రస్ట్‌ పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుంది’ అని ప్రకటించారు.

రామజన్మభూమి వివాదంపై కోర్టు విస్పష్ట తీర్పు తర్వాత  130 కోట్ల మంది భారతీయులు మన దేశ ప్రజాస్వామ్య విధానంపై అత్యంత విశ్వాసాన్ని కనబరుస్తూ వ్యవహరించారని, వారికి సెల్యూట్‌ చేస్తున్నానని మోదీ అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సున్నీవక్ఫ్‌ బోర్డుకు ఐదెకరాల భూమి ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని తెలిపారు.

More Telugu News