Hyderabad: బతిమాలినా మద్యం తాగలేదన్న కోపంతో.. బీరు బాటిల్‌తో దాడిచేసిన స్నేహితుడు!

  • పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసేందుకు బంటుమిల్లి నుంచి వచ్చిన యువకుడు
  •  పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సంతకం
  • దాడిలో తీవ్ర గాయాలు

ఎంతగా బతిమాలుతున్నా మద్యం ముట్టేందుకు నిరాకరించిన స్నేహితుడిపై ఓ వ్యక్తి బీరుబాటిల్‌తో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మచిలీపట్టణం సమీపంలోని బంటుమిల్లికి చెందిన దినేశ్ (18) ఓ కేసు విషయమై పోలీస్ స్టేషన్‌లో సంతకం చేసేందుకు సోమవారం హైదరాబాద్ వచ్చాడు. స్నేహితుడు గణేశ్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వచ్చిన పని పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత బయటకు వచ్చిన వారికి నవీన్, సాయి అనే మరో ఇద్దరు స్నేహితులు తోడయ్యారు. అందరూ కలిసి పార్టీ చేసుకోవాలని భావించి మద్యం తెచ్చుకున్నారు. గణేశ్, సాయి, నవీన్‌లు మద్యం తాగగా, దినేశ్ తాగేందుకు నిరాకరించాడు. నవీన్ పలుమార్లు బతిమాలినప్పటికీ గణేశ్ నిరాకరించడంతో వారి మధ్య ఘర్షణ మొదలైంది. అది మరింత పెరగడంతో కోపం పట్టలేని నవీన్ తన చేతిలో ఉన్న బీరుసీసాతో దినేశ్‌పై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన దినేశ్‌ను స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News