Rajinikanth: తనకు ‘అన్నీ’ తెలుసన్న రజనీకాంత్‌కు సమన్లు.. 25న హాజరుకావాలని ఆదేశం

  • తూత్తుకుడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా గతేడాది ఆందోళనలు
  • పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి
  • రజనీకి సమన్లు జారీ చేసిన ఏకసభ్య కమిషన్

తమిళనాడులోని తూత్తుకుడి రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా గతేడాది పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు నిరాకరించిన రజనీకాంత్.. తనకు ‘అన్నీ’ తెలుసని వ్యాఖ్యానించారు.

రజనీ అప్పట్లో చేసిన ‘అన్నీ తెలుసు’ వ్యాఖ్యలపై తాజాగా సమన్లు జారీ అయ్యాయి. తూత్తుకుడి కాల్పుల ఘటనపై విచారణకు ఏర్పాటైన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ రజనీకాంత్‌కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 379 మందిని కమిషన్ ప్రశ్నించింది.

More Telugu News