Nara Lokesh: పసిబిడ్డ లాంటి ‘అమరావతి’ని ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి చంపేశారు: నారా లోకేశ్

  • అమరావతిని అడ్డంగా నరికేశారు
  • ‘తల’ను విశాఖకు, కాళ్లూచేతులు రాయలసీమకు ఇస్తానంటారా?
  • మిగిలిన శవాన్ని ఇక్కడ పెట్టి పండగ చేసుకోమంటారా?

పసిబిడ్డ లాంటి ‘అమరావతి’ని ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి చంపేశారంటూ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అమరావతిని అడ్డంగా నరికేశారని, ‘తల’ ను తీసుకెళ్లి విశాఖ పట్టణానికి, కాళ్లూచేతులను రాయలసీమకు ఇస్తానని అంటున్నారని, మిగిలిన శవాన్ని ఇక్కడ పెట్టి పండగ చేసుకోమనే వ్యక్తి ‘ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గారు’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

గత నలభై తొమ్మిది రోజుల నుంచి మహిళలు పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తున్నారని, మహిళలను కూడా ఈ ప్రభుత్వం అవమానపరుస్తోందని దుయ్యబట్టారు. మంగళగిరిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న మహిళలను ఈడ్చుకుని పోలీసులు తీసుకెళ్లారని, ‘మిమ్మల్ని వదిలేస్తాం.. మీ కులం ఏంటో చెప్పండి?’ అని వాళ్లను పోలీస్ స్టేషన్ లో అడిగారని ఆరోపించారు. రైతులు ఎప్పుడూ పేదరికంలో ఉండాలని, గోచి పెట్టుకుని వారు తిరగాలన్నదే ఆయన ఉద్దేశమంటూ విరుచుకుపడ్డారు. ‘జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెబుతున్నా.. మన తెలుగింటి ఆడపడుచులు మిమ్మల్ని తన్నారంటే, ఈ ప్రభుత్వం ఒక్క క్షణంలో కూలిపోతుంది’ అంటూ హెచ్చరించారు.

More Telugu News