KCR: బస్సులపై ఫొటోలతో ప్రచారం చేసుకోవాల్సిన అగత్యం పట్టలేదు: సీఎం కేసీఆర్

  • తెలంగాణలో ఫిబ్రవరి నుంచి ఆర్టీసీ కార్గో సేవలు
  • కార్గో బస్సులపై కేసీఆర్ ఫొటోలంటూ వార్తలు
  • ఇలాంటి చవకబారు ప్రచారం తాను కోరుకోనని వెల్లడి

ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలే తప్ప, చవకబారు ప్రచారం పొందాలనుకోవడం తనకు ఇష్టం లేదని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణలో సరకు రవాణా చేసే కార్గో బస్సులపై కేసీఆర్ ఫొటోలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోందన్న వార్తలు రావడంతో ఆయన పైవిధంగా స్పందించారు.

బస్సులపై ఫొటోలతో ప్రచారం చేసుకోవాల్సినంత అవసరం తనకు లేదని అన్నారు. ఇలాంటి అంశాలను తాను ప్రోత్సహించబోనని స్పష్టం చేశారు. అటు, కార్గో బస్సులపై సీఎం ఫొటోలు వద్దంటూ ఆర్టీసీకి సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునే పథకాల్లో భాగంగా కొత్తగా కార్గో బస్సులను తీసుకువస్తున్నారు. సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఈ బస్సులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

More Telugu News