Roja: చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

  • ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ బుద్ధి చెప్పి ఉంటే బాగుండేది
  • రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలయ్యలను తరిమికొట్టే రోజు వస్తుంది
  • పవన్ కల్యాణ్ కు జీవోల గురించి అవగాహన లేదు

టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేనాని పవన్ కల్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోకపోవడం వల్లే బాలకృష్ణకు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతోందని అన్నారు. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలకృష్ణలను తరిమికొట్టే రోజు వస్తుందని చెప్పారు.

పెద్దల సభ (శాసనమండలి)కు పెద్దలను కాకుండా దద్దమ్మలను తీసుకొచ్చారంటూ చంద్రబాబుపై రోజా మండిపడ్డారు. మండలిలో ఉన్నవారంతా చంద్రబాబు భజనపరులేనని అన్నారు. ఇలాంటివారు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా నారా లోకేశ్ గెలవలేరని, ఆయన రాజకీయ భవిష్యత్తు సమాధి అయినట్టేనని అన్నారు. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే మండలి రద్దును చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

పవన్ కల్యాణ్ కు జీవోల గురించి ఏమాత్రం అవగాహన లేదని రోజా ఎద్దేవా చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను చీకటి జీవోలంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ తాపత్రయపడుతున్నారని కొనియాడారు. ఎవరు అడ్డుకున్నా మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు.

More Telugu News