Air India: సాహసానికి నజరానా... ఎయిరిండియా ఉద్యోగులకు సెలవుల పండుగ!

  • చైనా వెళ్లి వచ్చినందుకు బహుమానం 
  • వారం రోజులపాటు ఎంజాయ్ అన్న సంస్థ 
  • ఇటీవల రెండు ప్రత్యేక విమానాల్లో భారతీయుల రాక

చైనాను చూసి ప్రపంచమే వణుకుతోంది. 'మా దేశానికి ఎవరూ రావద్దు...ఆ దేశం ఎవరూ వెళ్లవద్దు' అంటూ అన్ని దేశాలు స్వీయనియంత్రణ పాటిస్తున్నాయి. ఇందుకు కారణం అక్కడ అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్. ఈ వైరస్ బారిన పడి డ్రాగన్ విలవిల్లాడుతోంది. అటువంటి సమయంలో ఎవరైనా అక్కడికి వెళ్లారంటే అది సాహసమే కదా. అంతటి సాహసం చేసినందుకే ఎయిరిండియా తమ సంస్థ ఉద్యోగులకు వారం రోజులు సెలవుల నజరానా ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే... కరోనా భయంతో అల్లాడిపోతున్న చైనాలో భారతీయ విద్యార్థులు, సందర్శకులు, వ్యాపారం పనిమీద వెళ్లిన వారు పెద్ద ఎత్తున చిక్కుకున్నారు. అక్కడి వూహాన్ నగరంలో కరోనా మరణాల సంఖ్య తీవ్రంగా ఉండడంతో వీరంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడ చిక్కుకున్న తమ వారి గురించి వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ప్రభుత్వమే ఏదో ఒకటి చేయాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఎయిరిండియా ప్రత్యేక విమానంలో రెండు విడుతలుగా దాదాపు 650 మందిని అక్కడి నుంచి తీసుకువచ్చింది. మరి ఈ రెండు విమానాలు చైనా వెళ్లాలంటే సిబ్బంది కావాలి కదా. కరోనా కలకలంతో అల్లాడిపోతున్న దేశం వెళ్లి రావాలంటే సిబ్బంది సాహసం చేయాల్సిందే కదా.

అంతటి సాహసం చేశారు కాబట్టే వారికీ నజరానా అంటూ సంస్థ ప్రకటించింది. విమానయానంలో సేవలందించిన 30 మంది కేబిన్ క్రూ, ఎనిమిది మంది పైలట్లు, పది మంది కమర్షియల్ ఉద్యోగులతో కలిపి మొత్తం 64 మందికి ఈ సెలవులు మంజూరు చేసింది.

More Telugu News