Arvind Kejriwal: అవును.. కేజ్రీవాల్ ఉగ్రవాదే: బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ పునరుద్ఘాటన

  • ఎన్నికల సభలో కేజ్రీని ఉగ్రవాదిగా అభివర్ణించిన బీజేపీ ఎంపీ
  • 96 గంటలపాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం
  • బాగా ఆలోచించే తానామాట అన్నానని సమర్థించుకున్న ఎంపీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ సమర్థించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల క్రితం ఓ సభలో పర్వేష్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిగా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ‘ఆప్’ ఈసీకి ఫిర్యాదు చేసింది. స్పందించిన ఈసీ 96 గంటలపాటు ప్రచారం చేయకుండా పర్వేష్‌పై నిషేధం విధించింది.

తాజాగా, పర్వేష్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. ఆయనను ఉగ్రవాదితో పోల్చడంలో తప్పులేదన్నారు. తాను బాగా ఆలోచించిన తర్వాతే ఈ మాట అన్నానని, తానన్నదాంట్లో తప్పులేదని సమర్థించుకున్నారు. ప్రధానిపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేస్తున్నారని, కాబట్టి కేజ్రీని ఎంత విమర్శించినా తక్కువేనని పర్వేష్ తేల్చి చెప్పారు.

More Telugu News