Kishan Reddy: కరోనా వైరస్ పై మేం అప్రమత్తంగానే ఉన్నాం: కిషన్ రెడ్డి

  • ఐదుగురు మంత్రులతో కేంద్రం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • టాస్క్ ఫోర్స్ కు వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్ నాయకత్వం
  • రాష్ట్రాల పరిస్థితిని అంచనా వేస్తున్నామన్న కిషన్ రెడ్డి

దేశంలో మూడు కరోనా వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్రం సన్నద్ధతపై హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని తెలిపారు. ఐదు మంత్రిత్వ శాఖల మంత్రులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

వైద్యశాఖ మంత్రి హర్షవర్థన్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేస్తుందని వివరించారు. రాష్ట్రాలకు కరోనా వైరస్ నిర్ధారణ కిట్లు, వైద్య బృందాల తరలింపుపై కమిటీ చర్చిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని, కరోనా వైరస్ సోకిన బాధితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తామని చెప్పారు. కేరళ, ఇతర రాష్ట్రాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, చైనా నుంచి విద్యార్థులను, ఇంజినీర్లను తీసుకువచ్చి పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు.

More Telugu News