Polavaram Project: ‘పోలవరం’ పనులన్నీ అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయి: మంత్రి అనిల్

  • ‘పోలవరం’పై కేంద్ర బృందం కూడా సంతృప్తి వ్యక్తం చేసింది
  • ‘పోలవరం’పై కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయి
  • ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్ కన్నా జగన్ ముందున్నారు

పోలవరం ప్రాజెక్టు పనులన్నీ అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. అనంతరం, తనను పలకరించిన మీడియాతో అనిల్ మాట్లాడుతూ, జగన్ సీఎం అయిన తర్వాత ‘పోలవరం’పై తొలిసారి నిర్వహించిన సమావేశంలో అధికారులకు ఏవిధంగా అయితే సూచనలు చేశారో ఆవిధంగానే వారు ముందుకు వెళ్తున్నారని చెప్పారు.

ఈ ప్రాజెక్టు పనుల గురించి ఏవో కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయే తప్ప, ‘పోలవరం’కు సంబంధించి అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని కేంద్ర బృందం కూడా చెప్పిందని అన్నారు. నాడు పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆయన కొడుకు జగన్ ఆ ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్తున్నారని, అది దైవ సంకల్పమని అన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో తన తండ్రి వైఎస్ కన్నా జగన్ వంద అడుగులు ముందుకేసి వెళుతున్నారని అన్నారు.

More Telugu News