YSRCP: మీ బ్యాచ్ కి పుట్టగతులు ఉండవు విజయసాయిరెడ్డి గారు: బుద్ధా వెంకన్న

  • రూ.2 వేల పెన్షన్ ఇవ్వడానికి గ్రామ వాలంటీర్ల పేరుతో రూ.50 కొట్టేస్తున్నారు
  • 27 కోట్ల రూపాయలు ఇంటికి తెచ్చినందుకు మామూళ్లుగా కొట్టేస్తున్నారు 
  • వృద్ధుల సొమ్ము కొట్టేయమని చెప్పారు

సంక్షేమ పెన్షన్లను ఒకటో తేదీన ఇచ్చే పద్ధతి దేశంలో ఎక్కడా లేదని, సీఎం జగన్ ఆదేశాలతో ఒకటో తేదీన వాలంటీర్లు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.

'రూ.2 వేల పెన్షన్ ఇవ్వడానికి గ్రామ వాలంటీర్ల పేరుతో 50 రూపాయలు కొట్టేస్తున్నారు. వృద్ధులకు చెందాల్సిన 27 కోట్ల రూపాయలు ఇంటికి తెచ్చినందుకు మామూళ్లుగా కొట్టేస్తున్నారు. వృద్ధుల సొమ్ము కొట్టేయమని చెప్పిన మీ బ్యాచ్ కి పుట్టగతులు ఉండవు సాయిరెడ్డి గారు' అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
 
'పెన్షన్ వయోపరిమితి 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గిస్తూ మొదటి సంతకం చేసారు. 8 నెలలు గడుస్తున్నా 60 ఏళ్లు ఉన్న ఒక్కరికీ పెన్షన్ ఇవ్వకుండా దగా చేశారు. పైగా 7 లక్షల పెన్షన్లు ఎత్తేశారు. ఇప్పుడు పెన్షన్ డోర్ డెలివరీ అంటూ మరో స్కామ్ మొదలెట్టారు' అని బుద్ధా వెంకన్న విమర్శించారు.
 
'పెన్షనర్ల కళ్లలో జగన్‌  గారితో కారం కొట్టించి నిప్పులు పోసుకోవద్దు అంటూ సలహాలు ఏంటి విజయసాయిరెడ్డి సారు. పెన్షన్ల పేరుతో జగన్ గారు చేసిన మోసం అంతా ఇంత కాదు. 3 వేల పెన్షన్ అని 250 రూపాయిలు పెంచారు' అని ఆరోపించారు.

More Telugu News