Medaram: మేడారానికి హెలికాప్టర్ సేవలు మొదలు... చార్జ్ తెలిస్తే మాత్రం గుండె గుబేలే!

  • ఒకరికి చార్జ్ రూ. 30 వేలు
  • అదనంగా రూ. 3 వేలు చెల్లిస్తే జాతర ప్రాంత దర్శనం
  • సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ నుంచి మేడారం జాతర ప్రాంతానికి హెలికాప్టర్ సేవలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఈ సదుపాయాన్ని భక్తులకు దగ్గర చేసింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ హెలికాప్టర్ చార్జ్ ఎంతన్నది తెలిస్తే మాత్రం గుండె గుభేల్మనక మానదు. ఒకరికి రూ. 30 వేలు చెల్లించాలట. దీనికి జీఎస్టీ అదనం సుమా. హెలికాప్టర్ లో ఆరుగురు ప్రయాణించే వీలుండగా, ఆరుగురున్న కుటుంబం హెలికాప్టర్ లో ప్రయాణించాలంటే, రూ. 1.80 లక్షలకు అదనంగా పన్నులను కలిపి చెల్లించాలి.

ఇక ఈ హెలికాప్టర్ సేవలను ఈ ఉదయం తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించారు. హెలికాప్టర్ లో వెళ్లేవారికి సమ్మక్క, సారలమ్మ దర్శనం కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇక మేడారంలో రూ. 2,999 ఆదనపు చెల్లింపుతో జాతర ప్రాంతమంతా తిరిగి వచ్చే సదుపాయాన్ని కల్పించామని ఆయన అన్నారు. హెలికాప్టర్ లో యాత్ర చేయాలని కోరుకునే వారు 9400399999 నంబర్‌ ను సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెల్లడించారు.

More Telugu News