Telugudesam: జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • రాజధాని ప్రాంత రైతులను కలిసిన జేసీ
  • జగన్ ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారు
  • బాబుపై కోపం ఉంటే ముక్కలు ముక్కలు చేయి కానీ, రైతులను దెబ్బ తీయొద్దు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంలో దీక్షలు చేస్తున్న రైతులను ఆయన కలిశారు. రైతుల దీక్షా శిబిరానికి వెళ్లి వారికి తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలు జగన్ కు కనిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై కోపంతో ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై నీకు కోపం ఉంటే ఆయన్ని ముక్కలు ముక్కలు చేయి, అంతేతప్ప, అమరావతి ప్రాంత రైతులను దెబ్బతీయొద్దంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, తనపై జగన్ కు కోపం వుంటే తనను నాశనం చేయాలి తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించొద్దని జగన్ కు సూచించారు.

ఆ ఏసు ప్రభువు తప్ప ఎవరూ జ్ఞానోదయం కలిగించలేరు!  

ఓ మనిషికి మెదడు ఎంత ముఖ్యమో, రాజధానికి సెక్రటేరియట్ కూడా అలాంటిదేనని జేసీ అభిప్రాయపడ్డారు. రాజధాని ప్రాంత పర్యటనకు ముందు విలేకరులతో ఆయన మాట్లాడుతూ, అలాంటి సెక్రటేరియట్ ను తీసుకెళ్లి విశాఖలో పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ‘ఆయనకు (జగన్ కు) ఆ ఏసు ప్రభువు తప్ప ఎవరూ జ్ఞానోదయం కలిగించలేరని నా అభిప్రాయం’ అని అన్నారు.

More Telugu News