Manchu Lakshmi: వాళ్లిద్దరి మధ్య గొడవలు ఉంటే ఇన్నాళ్లు మేం కలిసుండేవాళ్లం కాదు: మంచు లక్ష్మి

  • మోహన్ బాబు, చిరంజీవి మధ్య స్పర్ధలున్నాయంటూ ప్రచారం
  • స్పందించిన మంచు లక్ష్మి
  • ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందని వెల్లడి

టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మోహన్ బాబుకు, మెగాస్టార్ చిరంజీవికి మధ్య విభేదాలు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారని, అందులో వాస్తవం లేదని తెలిపారు. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఆత్మీయక్షణాలకు సంబంధించిన ఫొటోను పంచుకున్న మంచు లక్ష్మి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ లో తన తండ్రి, చిరంజీవిల ఫొటోలు సందడి చేస్తుండడం చూసిన తర్వాత ఎంతో సంతోషం కలిగిందని, ఒకవేళ తన తండ్రి మోహన్ బాబుకు, చిరంజీవి అంకుల్ కు మధ్య గొడవలు ఉంటే రెండు కుటుంబాల వాళ్లం ఇన్నేళ్లు కలిసిమెలిసి ఉండేవాళ్లం కాదని స్పష్టం చేసింది.

"అప్పట్లో నాన్న, చిరంజీవి అంకుల్ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వాళ్ల సినిమాలు ఎక్కువగా ఊటీలో చిత్రీకరణ జరుపుకునేవి. వేసవి వచ్చిందంటే చాలు మా రెండు ఫ్యామిలీలు ఊటీలో ఎంజాయ్ చేసేవాళ్లం. వీకెండ్స్ లో ఒకరింటికి మరొకరం వెళ్లేవాళ్లం. నిజంగానే వాళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు ఉంటే అన్ని సినిమాల్లో కలిసి నటించేవాళ్లా? వాస్తవానికి వారిద్దరి మధ్య ఉన్నది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే. సినీ ప్రేమికులందరూ ఈ విషయం గ్రహించాలి" అని మంచు లక్ష్మి విజ్ఞప్తి చేశారు.

More Telugu News