Pawan Kalyan: 'గబ్బర్ సింగ్' కాంబోలో మరో సినిమా.. పవన్ ఫ్యాన్స్ కు పండగ!

  • పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో కొత్త చిత్రం
  • తెరకెక్కించనున్న మైత్రి మూవీ మేకర్స్
  • మరో రెండు సినిమాల్లో నటిస్తున్న పవన్

పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన కొత్త సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్న ఫ్యాన్స్ కు మైత్రి మూవీ మేకర్స్ తీపి కబురు అందించింది. పవన్ కల్యాణ్ తో సినిమా ఖరారైందని ప్రకటించింది. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తాడని వెల్లడించింది. 'గబ్బర్ సింగ్' చిత్రం తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో రానున్న చిత్రాన్ని తాము తెరకెక్కించబోతుండటం సంతోషంగా వుందని తెలిపింది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది.

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయ కారణాలతో సినిమాలకు పవన్ కల్యాణ్ దూరంగా ఉంటున్నారు. తాజాగా బాలీవుడ్ సినిమా 'పింక్' రీమేక్ లో ఆయన నటిస్తున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా పవన్ నటిస్తున్నారు. పవన్ మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

More Telugu News