Nirmala Sitharaman: అరుణ్ జైట్లీని గుర్తు చేసుకుంటూ మొదలైన నిర్మలమ్మ ప్రసంగం!

  • లోక్ సభ ముందుకు వచ్చిన బడ్జెట్
  • దేశాన్ని ముందుకు నడిపించడంలో జైట్లీది కీలక పాత్ర
  • మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు
  • మరింత ఉత్సాహంతో పని చేస్తామన్న నిర్మలా సీతారామన్

2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె, మాజీ ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్ జైట్లీని గుర్తు చేసుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య దేశాన్ని ముందుకు నడిపించడంలో ఆయన పాత్ర ఎంతైనా ఉందని కొనియాడారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో కోరుకున్నారని అన్నిరు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరింత పునరుత్తేజంతో మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి తామంతా పని చేస్తున్నామని తెలిపారు.

ఇటీవలి కాలంలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయని, కేంద్ర ఖజానాకు చేరుతున్న ఆ నిధులన్నీ, తిరిగి ప్రజోపయోగ సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. సరకు రవాణా, ప్రజా రవాణా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజల ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తిని పెంచేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయని, యువతను మరింత శక్తిమంతం చేసేందుకు కట్టుబడి వున్నామని వెల్లడించారు.

సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం భవిష్యత్త వృద్ధికి సంకేతమని నిర్మల అభిప్రాయపడ్డారు.

More Telugu News