JC Diwakar Reddy: కోర్టులను కూడా లెక్క చేయని మా వాడికి కంగ్రాట్స్ : జగన్ పై జేసీ ఫైర్

  • చంపకుండా మా ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారు
  • జగన్ ది ఆయన తాత మనస్తత్వం
  • జగన్ కు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఏసు ప్రభువును కోరుకుంటున్నా

ముఖ్యమంత్రి జగన్ ది ఆయన తాత రాజారెడ్డి మనస్తత్వమని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ది ఫ్యాక్షన్ సంస్కృతి అని విమవర్శించారు. అధికారం ఉందనే అహంకారంతో తమ బస్సులను ఆపేయించాడని మండిపడ్డారు. బస్సుల సీజ్ విషయంలో కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదని దుయ్యబట్టారు. కోర్టులను కూడా లెక్క చేయని మా వాడికి కంగ్రాట్స్ చెబుతున్నానని అన్నారు. తమను మరో విధంగా దెబ్బతీసేందుకు దురుద్దేశంతో త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ భూములను వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. చంపకుండా ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, తమకు ఏమీ కాదని జేసీ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించినట్టు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు మంచి బుద్ధిని ప్రసాదించాలని రాజారెడ్డి ఆత్మను, ఏసు ప్రభువును కోరుకుంటున్నానని చెప్పారు. అన్ని విషయాలు ప్రధాని మోదీకి చెప్పే చేస్తున్నానని జగన్ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. రాజధాని తరలింపుపై హైకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టేశాడని చెప్పారు. జగన్ అనుసరిస్తున్న వైఖరితో వ్యవస్థలన్నీ దెబ్బతింటాయని అన్నారు.

More Telugu News