Saurav Ganguly: భారత క్రికెట్ జట్టు కొత్త చీఫ్ సెలక్టర్ పై హింట్ ఇచ్చిన సౌరవ్ గంగూలీ!

  • ముగిసిన ఎంఎస్కే ప్రసాద్ పదవీకాలం
  • దరఖాస్తు చేసుకున్న పలువురు మాజీలు
  • సీనియర్ కే ప్రాధాన్యత ఇస్తామన్న గంగూలీ

భారత క్రికెట్ జట్టు ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్, ఆయన సహచరుడు గగన్ ఖోడా పదవీ కాలం ముగియగా, కొత్త సెలక్టర్ పదవి కోసం మదన్ నాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్ తదితరులు అన్వేషణ ప్రారంభించారు. త్వరలోనే పర్సనల్ ఇంటర్వ్యూలు జరుగనుండగా, చీఫ్ సెలక్టర్ గా ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయమై బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఓ క్లూ ఇచ్చారు.

గతంలో టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్నవారు లేదా అత్యంత సీనియర్ కు మాత్రమే పదవి దక్కుతుందని గంగూలీ అన్నట్టు సమాచారం. ఇక మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, లక్ష్మణ్ శివరామ కృష్ణన్ లు మొదలుకొని వెంకటేశ్ ప్రసాద్, నయన్ మోంగియా, నిఖిల్ చోప్రా, అబే కురువిల్లా, చేతన్ చౌహాన్, రాజేశ్ చౌహాన్ తదితరులు దరఖాస్తు చేశారు.

ఇక ప్రస్తుతం దరఖాస్తు చేసిన వారిలో లక్ష్మణ్ శివరామకృష్ణన్ అత్యంత అనుభవశాలిగా ఉన్నారు. 1983లో తొలిసారి క్రికెట్ ప్రపంచంలోకి ప్రవేశించిన ఆయన ఆడిన టెస్టుల సంఖ్య తక్కువే అయినా, అనుభవజ్ఞుడిగా పేరుంది. ఇక వెంకటేశ్ ప్రసాద్ విషయానికి వస్తే, 33 టెస్టులు ఆడిన అనుభవంతో ఉండగా, అగార్కర్ కు 26 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. దీంతో ప్రధానంగా వీరి ముగ్గురి మధ్యే పోటీ ఎక్కువగా ఉంటుందని సమాచారం.

More Telugu News