Nirmala Sitharaman: బడ్జెట్ వచ్చేసింది... లోక్ సభకు చేరుకున్న నిర్మలమ్మ!

  • ఎన్డీయే ప్రభుత్వంలో రెండో విడత బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
  • ఇప్పటికే ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్
  • మధ్యతరగతికి ఊరట కలిగించేలా కొన్ని నిర్ణయాలు

ఎన్డీయే ప్రభుత్వంలో రెండో విడత బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకున్నారు. బడ్జెట్ ప్రతులతో ఆమె తొలుత క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు. మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఆపై ఆమె లోక్ సభకు చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు 2020-21 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు రానున్నాయి.

కాగా, మధ్య తరగతికి ఊరట కలిగించేలా కొన్ని నిర్ణయాలను నిర్మలమ్మ ప్రతిపాదించ వచ్చని ఆర్థిక వర్గాలు ఇప్పటికే అభిప్రాయపడ్డాయి. పన్ను రాయితీలను పెంచుతూ ఆమె నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేలా, ఉత్పత్తి రంగానికి రాయితీలను ఆమె సిద్ధం చేశారని, తగ్గుతున్న ఆర్థిక వృద్ధిని తిరిగి గాడిలో పడేసేందుకు నిర్ణయాలతో పాటు, కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచేలా నిర్ణయాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఇదిలావుండగా, ఈ సంవత్సరం రక్షణ రంగానికి కేటాయింపులు మరింతగా పెరుగుతాయని కూడా తెలుస్తోంది. ద్రవ్యలోటు కట్టడి కీలకమైన నేపథ్యంలో, ఎగుమతులపైనా పన్నులను పెంచనున్నారని సమాచారం.

More Telugu News