CoronaVirus: బెంబేలెత్తిస్తున్న కరోనా... 13 వేలను దాటిన బాధితులు, 300కు చేరువైన మృతులు!

  • మరింతగా విస్తరించిన వైరస్
  • వూహాన్ నగరంలో గణనీయంగా పెరిగిన బాధితులు
  • మరో 50 వేల మందికి వైరస్ లక్షణాలు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మరింతగా విస్తరించింది. ఈ వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన చైనాలోని వూహాన్ నగరంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికే కరోనా వైరస్ సోకినట్టు 13 వేల మందికి నిర్ధారణ కాగా, మరో 50 వేల మంది రక్త పరీక్షల ఫలితాలు వెల్లడి కావాల్సి వుందని చైనా వర్గాలు వెల్లడించాయి.

ఇక ఇప్పటివరకూ రోజుకు 10 నుంచి 20 మరణాలు నమోదుకాగా, గడచిన రెండు రోజుల వ్యవధిలోనే మరణాల సంఖ్య రెట్టింపు అయింది. బుధవారం నాటికి 120 మంది మరణించారని అధికారిక లెక్కలు విడుదల చేసిన చైనా, నేడు ఆ సంఖ్య 259కి చేరినట్టు పేర్కొంది. అనధికారికంగా మరో 50 మందికి పైగా కరోనా కారణంగా మృతి చెంది వుంటారని అంచనా.

కాగా, ఇండియా సహా 20 దేశాలకు ఈ వైరస్ వ్యాపించడంతో అన్ని దేశాల విమానాశ్రయాల్లో విదేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు అయ్యాయి. ఎయిర్ పోర్టులకు సమీపంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన వివిధ దేశాలు, 14 రోజుల పాటు వారిని అక్కడే ఉంచి, కరోనా లక్షణాలు కనిపించకుండా ఉంటేనే బయటకు పంపించాలని నిర్ణయించారు. ఇదిలావుండగా, చైనా పౌరులకు జారీ చేసే వీసాలపై భారత్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి.

More Telugu News