BJP: ఒవైసీతో కలిసి కేసీఆర్ కుట్ర చేస్తున్నారు: బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్

  • వీళ్లిద్దరూ కలిసి హిందువులను విడదీసే పని చేస్తున్నారు
  • దళితులను హిందుత్వకు దూరం చేసే కుట్ర
  •  హిందువులకు వ్యతిరేకంగా కేసీఆర్ ఉన్నారు

కేంద్ర ప్రభుత్వ పథకం ఆవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా రెండు కోట్ల ఇళ్లను నిర్మించి మహిళలకు అందజేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ ఇళ్లు ఇంకా ఎందుకు నిర్మాణం కాలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ పథకం కింద తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులను కాళేశ్వరం ప్రాజెక్ట్ కు, మిషన్ భగీరథకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని ఆరోపించారు. ఈ విషయమై తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఆలోచించాలని సూచించారు.

ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మించిందన్న కేటీఆర్ ప్రశ్నకు అరవింద్ స్పందిస్తూ, రెండు కోట్ల ఇళ్లు నిర్మించారని, ఈ విషయాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో కూడా ప్రస్తావించారని గుర్తుచేశారు. ‘ఆయుష్మాన్ భారత్’కు తెలంగాణ ప్రజలను దూరంపెట్టే దుర్మార్గపు ఆలోచన కేసీఆర్, కేటీఆర్ లది అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన కుటుంబాల్లో ముస్లింలు, క్రైస్తవులు లేరా? అని సీఎం కేసీఆర్ కు సూటి ప్రశ్న వేశారు. ముస్లింలకు, క్రైస్తవులకు ఎవరైనా ద్రోహం చేస్తున్నారంటే అది కేసీఆరే అని ధ్వజమెత్తారు.

కేసీఆర్, ఎంఐఎం అధినేత సలావుద్దీన్ ఒవైసీ కలిసి గురుకులాల్లో ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, హిందువులను విడదీసే పని చేస్తున్నారని ఆరోపించారు. దళితులను హిందుత్వకు దూరం చేసే కుట్రను ఒవైసీతో కలిసి కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. హిందువులకు వ్యతిరేకంగా కేసీఆర్ ఉన్నారని, పోనీ, ముస్లింలకు ప్రయోజనకరమైన పనులు ఏమైనా కేసీఆర్ చేస్తున్నారా అంటే అదీ లేదని విమర్శించారు.

More Telugu News