Jagan: ఉద్యోగ నియామకాల క్యాలెండర్ పై సీఎం జగన్ సమీక్ష

  • మంత్రి కొడాలి, సీఎస్, డీజీపీలతో జగన్ భేటీ
  • పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చిన సీఎం
  • ఫిబ్రవరి 21న మరోసారి సమావేశం

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ పలు సూచనలు చేశారు. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు కోరుకుంటున్నామని, ఆయా రంగాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు.

విద్యారంగం అభివృద్ధి కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తుంటే, స్కూళ్లలో తగినంతమంది సిబ్బంది లేకపోతే ఆ నిధులన్నీ వృథాయేనని అన్నారు. ఉపాధ్యాయుల సంఖ్య తగినంత లేకపోతే స్కూళ్ల సామర్థ్యంపై ఆ ప్రభావం పడుతుందని వివరించారు. స్కూళ్లలో ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఉండాలని జగన్ ఆదేశించారు.

అంతేగాకుండా, పోలీసు శాఖ సామర్థ్యం తగ్గకుండా చూసుకుని, వీక్లీ ఆఫ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో ప్రాధాన్యత క్రమం అనుసరించి పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాను చేసిన సూచనలపై అధికారులు ఇచ్చే నివేదికలపైన సీఎం జగన్ ఫిబ్రవరి 21న మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.

More Telugu News