OU: ఓయూలో ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్నా కాశీంనే అరెస్ట్ చేశామంటే ఎలాంటివాడో అర్థం చేసుకోండి: పోలీసులు

  • ఇటీవలే ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్
  • మావోయిస్టులతో సంబంధాలు కలిగివున్నట్టు ఆరోపణలు
  • పోలీసుల కౌంటర్ కాపీలో ఆసక్తికర వివరాలు!

మావోయిస్టులతో సంబంధాలు కలిగివున్నాడన్న ఆరోపణలతో తెలంగాణలో ప్రొఫెసర్ కాశీం అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ కాశీం కేసులో పోలీసుల కౌంటర్ కాపీలో ఆసక్తికర విషయాలు మీడియాకు బహిర్గతమయ్యాయి. ఈ మేరకు వెల్లడైన వివరాల ప్రకారం.... కాశీంతో పాటు మావోయిస్టు భావజాలం ఉన్నవారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని పోలీసులు తెలిపారు.

విద్యార్థులకు మావోయిస్టు భావజాలాన్ని నూరిపోసేందుకే కాశీం ప్రొఫెసర్ ముసుగు ధరించాడని ఆరోపించారు. ఓయూలో ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్నా కాశీంనే అరెస్ట్ చేశామంటే ఆయన కుట్ర రూపాన్ని అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మావోయిస్టులతో కాశీంకు సంబంధాలున్న విషయం లొంగిపోయిన మావోయిస్టుల ద్వారా తెలిసిందని పోలీసులు వివరించారు.

'నడుస్తున్న తెలంగాణ' అనే పత్రికను కాశీం నిర్వహిస్తున్నాడని, ఆ పత్రికకు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చంద్రన్న నిధులు ఇస్తున్నాడని వెల్లడించారు. అంతేగాకుండా, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని మావోయిస్టులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో కూడా పోలీసులు తెలిపారు. సంభాషణల విషయంలో మావోయిస్టులు ఎంతో అభివృద్ధి చెందారని, డీకోడ్ చేయలేని విధంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. కాశీం ఇంట్లో లభ్యమైన హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ లు, సీడీలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, అందులోని డేటా ఎన్ క్రిప్షన్ పద్ధతిలో భద్రపరిచి ఉండడంతో వెలికితీయడం సాధ్యం కావడంలేదని పోలీసులు తమ కౌంటర్ కాపీలో పేర్కొన్నారు.

More Telugu News