Jagan: కేసుల మాఫీ కోసమే ఏపీ సీఎం జగన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు: కనకమేడల

  • కేసుల్లో విచారణ జరగకుండా పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారు
  • రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారు
  • తన నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ అస్థిరపరిచారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న కేసుల్లో విచారణ జరగకుండా పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని చెప్పారు. తన నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ అస్థిరపరిచారని, ఆయన నిర్ణయాలను కేంద్ర సర్కారు సమర్థిస్తుందని తాము భావించట్లేదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుని ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వంపై  కనకమేడల రవీంద్రకుమార్ విమర్శలు గుప్పించారు. ఈ అంశం రాష్ట్రానికి సంబంధించింది కాదని చెప్పిన ఆయన.. ఏపీ ప్రభుత్వం తీర్మానం మాత్రమే చేయగలదని, రద్దు చేయలేదని అన్నారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు మూడు రాజధానులు, మండలి రద్దులను తాము పార్లమెంట్‌లో లేవనెత్తుతామని చెప్పారు.

More Telugu News