BS-4: ఏప్రిల్ నుంచి బీఎస్-6 ఇంధనం.. పెరగనున్న ధరలు!

  • మార్చి 31తో బీఎస్-4 వాహనాలకు చెక్
  • ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 ప్రమాణాలతో వాహనాలు
  • అందుకు అనుగుణంగా పెరగనున్న ఇంధన ధరలు

వాహనాల నుంచి విడుదలవుతున్న కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా భారత్ స్టేజ్-4 (బీఎస్-4) ప్రమాణాలు కలిగిన వాహన విక్రయాలను నిషేధించింది. ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలాగే, అదే నెల ఒకటో తేదీ నుంచి ఈ ప్రమాణాలకు అనుగుణంగానే ఇంధనంలోనూ మార్పులు ఉండనున్నాయి. ఫలితంగా పెట్రోలు, డీజిల్ ధరలు యాభై పైసల నుంచి రూపాయి వరకు పెరగనున్నాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.73.36గా ఉండగా, డీజిల్ ధర రూ.66.36గా ఉంది. ఇప్పుడు బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేసేలా రిఫైనరీలను మార్చడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.17 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. మొత్తంగా అన్ని పరిశ్రమలు కలిసి రూ.30 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి నూతన ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజయ్‌సింగ్ తెలిపారు. బీఎస్-4 ప్రమాణాలతో పోలిస్తే కొత్త ప్రమాణాల ప్రకారం ఇంధనం ధరలు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

More Telugu News