Ayush: కరోనా వైరస్ కు హోమియోపతి, యునానితో చెక్: కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడి

  • హోమియోపతి మందు వాడితే.. వైరస్ సోకదు
  • ముందు జాగ్రత్తగా మందు తీసుకోవాలి
  • ‘ఆర్సినికం ఆల్బమ్ 30’ ను తీసుకోవాలని సూచన

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను నిరోధించేందుకు కేంద్ర ఆయుష్ శాఖ.. హోమియోపతి, యునాని వైద్యాన్ని సూచించింది. ఈ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్తగా హోమియోపతి, యునాని వైద్యం పనిచేస్తుందని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావాన్ని నిరోధించేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి సలహా మండలి భేటీ అయింది.

ఈ సందర్భంగా హోమియోపతి మందు ‘ఆర్సినికం ఆల్బమ్ 30’ ను ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో మూడురోజులు తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని భేటీలో వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ మందు రోగ నిరోధక ఔషధంగా పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. నెల రోజుల తర్వాత కూడా కరోనా వైరస్ ఇంకా వ్యాప్తిలో ఉంటే మరోసారి ఇదే మందును మూడు రోజులు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.

ముందు జాగ్రత్తలే మేలు

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల నివారణకు కొన్ని దేశీయ చిట్కాలు కూడా పనిచేస్తాయని తెలిపింది. ఆయుర్వేద, యునానీ కషాయాలు పనిచేస్తాయని ఆయుష్ శాఖ వెల్లడించింది. అనారోగ్యానికి గురైనవారికి సమీపంలోకి వెళ్లకుండా ఉండటమే మంచిదని అభిప్రాయపడింది. బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నప్పుడు ముఖానికి మాస్క్ లు ధరించాలని సూచించింది. కరోనా వైరస్ సోకినట్లు అనుమానముంటే.. వెంటనే మాస్క్ ధరించి సమీపంలోని అస్పత్రికి వెళ్లాలని పేర్కొంది. వ్యక్తి గత పరిశుభ్రత ముఖ్యమని పేర్కొంది. తరచుగా చేతులను సబ్బుతో కడుక్కుంటుండాలని సూచించింది.

More Telugu News