PV Sindhu: 'పద్మభూషణ్'తో నా బాధ్యత మరింత పెరిగింది: పీవీ సింధు

  • సింధుకు ఇటీవలే 'పద్మభూషణ్' ప్రకటించిన కేంద్రం
  • ప్రస్తుతం పీబీఎల్ లో ఆడుతున్న క్రీడాకారిణి 
  • టోక్యో ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యమంటున్న సింధు

భారత బ్యాడ్మింటన్ ధృవతార పీవీ సింధు ఇటీవలే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తున్న సింధు ప్రస్తుతం పీబీఎల్ లో హైదరాబాద్ హంటర్స్ జట్టులో ఆడుతోంది. ఈ లీగ్ చివరిదశకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. నేటి నుంచి ఫిబ్రవరి 9న జరిగే ఫైనల్ వరకు అన్ని మ్యాచ్ లు ఇక్కడి గచ్చీబౌలీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ ల కోసం సన్నద్ధమవుతున్న సింధు మీడియాతో మాట్లాడుతూ, పద్మభూషణ్ అవార్డు తనపై మరింత బాధ్యతను ఉంచిందని తెలిపింది.

చిన్నవయసులోనే ఇంతటి గొప్ప అవార్డుకు ఎంపికవడం ఎంతో సంతోషంగా ఉందని, క్రీడలను విశేషంగా ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల సర్కారులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ లో పతకం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని, ఒలింపిక్స్ కు అట్టే సమయం లేకపోవడంతో ఆడే ప్రతి టోర్నీలో రాణించేందుకు కృషి చేస్తున్నానని వివరించింది.

More Telugu News