Narendra Modi: మోదీ ఈ మూడు విషయాల గురించి మాట్లాడాలి: చిదంబరం

  • దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది
  • మోదీ వచ్చి ఆరేళ్లు అవుతున్నా ఇంకా అచ్చే దిన్ రాలేదు
  • మీ తిట్లను, వాక్చాతుర్యాన్ని ప్రజలు వినాలనుకోవడం లేదు

కేంద్ర బడ్జెట్ కు మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో... ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందని, ట్యాక్స్ రెవెన్యూ దారుణంగా పడిపోయిందని, ద్రవ్యోల్బణం పెరుగుతోందని ఆయన అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల తీరు కూడా సరిగా లేదని... అభ్యంతరకరమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలన వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్నా ఇంకా 'అచ్చే దిన్' రాలేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులందరూ వాస్తవాలను అంగీకరించడం లేదని చిదంబరం అన్నారు. ప్రజలంతా దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటున్నారని... మీ తిట్లను, వాక్చాతుర్యాన్ని కాదని అన్నారు.

ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మీరు మూడు విషయాల గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. 2019 జనవరిలో 2 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2019 డిసెంబర్ నాటికి 7.35 శాతానికి ఎందుకు పెరిగింది? 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2.5 లక్షల కోట్ల ట్యాక్స్ రెవెన్యూ వస్తుందని వేసిన బడ్జెట్ అంచనాలు ఎందుకు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళలు, పిల్లల కోసం అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఎందుకు తగ్గాయి? ఈ మూడు అంశాలపై మాట్లాడాలని చిదంబరం సవాల్ విసిరారు.

More Telugu News