YSRCP: ఎట్టి పరిస్థితుల్లోనూ శాసన మండలి రద్దు అవ్వదు జగన్ రెడ్డి గారూ: కేశినేని నాని

  • తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ ముందుకు తీసుకువెళ్లే అవకాశం లేదు
  • ఇటువంటి తీర్మానాలను తప్పుబడుతూ స్థాయీ సంఘం నివేదిక సమర్పించింది
  • దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు

'ఎట్టి పరిస్థితుల్లోనూ శాసన మండలి రద్దు అవ్వదు జగన్ రెడ్డి గారూ' అంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు. శాసనమండలి రద్దుపై ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో తాను మీడియాతో మాట్లాడిన పలు విషయాలను ఆయన ప్రస్తావించారు.

శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ ముందుకు తీసుకువెళ్లే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇటువంటి తీర్మానాలను తప్పుబడుతూ రాజ్యసభ స్థాయీ సంఘం ఓ నివేదిక సమర్పించిందని, దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో న్యాయ శాఖ మళ్లీ రాష్ట్రానికి సంబంధించిన తీర్మానాన్ని చేపట్టి పార్లమెంటుకు పంపదని చెప్పారు.

కాగా, 'జగన్ అన్నా, నువ్వూ నీ ముఠా అమరావతి నుండి రాజధానిని ఒక అంగుళం కూడా కదల్చలేరు. హైకోర్టును అమరావతి నుండి మార్చలేరు. శాసన మండలిని రద్దు చెయ్యాలనే  మీ ప్రతిపాదన జరిగే పని కాదు. మీ వల్ల ఏదీ కాదు' అని కేశినేని నాని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

More Telugu News