Bodo land: బోడో తీవ్రవాదులతో అసోం ప్రభుత్వం కీలక ఒప్పందం.. 30న 1550 మంది తీవ్రవాదుల లొంగుబాటు

  • బోడో గ్రూపులతో ప్రభుత్వం చర్చలు
  • దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం
  • ప్రత్యేక రాష్ట్రమో, కేంద్రపాలిత ప్రాంతమో కానున్న బీటీసీ

ప్రత్యేక బోడోల్యాండ్ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న తీవ్రవాద సంస్థలతో అసోం ప్రభుత్వం సోమవారం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యేక బోడోల్యాండ్ డిమాండ్‌తో జాతీయ బోడోల్యాండ్ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఎఫ్‌బీ), అఖిల బోడో విద్యార్థి సంఘం (ఏబీఎస్‌యూ), ఐక్య బోడో ప్రజల సంస్థ (యూబీపీవో)లు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నాయి.

తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రభుత్వం తీవ్రవాద సంస్థలతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి (బీటీసీ) కోకాఝర్, బక్సా, చిరాంగ్, ఉదాల్‌గురి ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా కానీ, కేంద్ర పాలిత ప్రాంతంగా కానీ ప్రకటిస్తారు. అలాగే, బోడోలు అధికంగా నివసించే గ్రామాలను కూడా బీటీసీలో విలీనం చేస్తారు. వచ్చే మూడేళ్లలో రూ.1500 కోట్లతో అభివృద్ధి చేస్తారు. తాజా ఒప్పందం ప్రకారం.. ఈ నెల 30న 1550 మంది బోడో తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోతారు.

More Telugu News