Brothers: నాన్న చనిపోయాడు... ఇద్దరితో తల్లికి సంబంధం... గుంటూరు ఎస్పీకి ఇద్దరు పిల్లల ఫిర్యాదు!

  • ఐదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి
  • ఆపై ఇద్దరితో తల్లి వివాహేతర సంబంధం 
  • తమను చిత్రహింసలు పెడుతున్నారని బాలల ఫిర్యాదు

తమ తండ్రి చనిపోయిన తరువాత, తల్లి తప్పుదారి పట్టిందని, ఇద్దరితో వివాహేతర సంబంధం నడుపుతూ, వారితో కలిసి తమను చిత్రహింసలు పెడుతోందని, 11, 13 ఏళ్ల వయసున్న అన్నదమ్ములు గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయానికి వచ్చి 'స్పందన'లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. గడచిన ఏడాదిగా తమను పట్టించుకోకుండా, హింసిస్తోందని వారిద్దరూ చెప్పడంతో పోలీసులు చలించిపోయారు.

బాధిత చిన్నారులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరి కుటుంబం నరసరావుపేటలో నివాసం ఉండేది. 2014లో నానమ్మ, 2015లో తండ్రి చనిపోయారు. అప్పటివరకూ బాగానే చూసుకున్న తల్లి, ఆపై వీరిద్దరినీ వదిలేసి తన దారి తాను చూసుకుంది. షేక్ రహీమ్ అనే వ్యక్తిని ఇంటికి తెచ్చిపెట్టుకుంది. ఆపై అతని స్నేహితుడు కొత్తపల్లి ప్రమోద్ అనే వ్యక్తి ఇంటికి రావడం మొదలు పెట్టాడు. వీరిద్దరూ చిన్నారులను తీవ్రంగా హింసించేవారు.

గత ఏడాది వీరిని స్కూల్ మాన్పించేసి, ఇంట్లోనే నిర్బంధించారు. ఈ నెల 24న బాధితుల తల్లి, ప్రమోద్ గొడవపడి, చిన్నారులను కొట్టి తరిమేశారు. పక్కనే ఉన్న షాపులో రూ. 100 అప్పు తీసుకుని, అమ్మమ్మ ఇంటికి వెళ్లిన వారు, 'స్పందన'కు వచ్చారు. తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, తల్లిని, ఆమెతో సంబంధమున్న ఇద్దరినీ శిక్షించాలని వారు వేడుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

More Telugu News