Chandrababu: తెనాలిలో రేపు చంద్రబాబు భారీ బహిరంగ సభ

  • తెనాలిలో 27 రోజులుగా రైతుల రిలే నిరాహార దీక్ష
  • శిబిరంపై వైసీపీ నేతల దాడులు
  • మునిసిపల్ మార్కెట్ వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు సభ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెనాలిలో రేపు (బుధవారం) భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు అమరావతి సంఘీభావ జేఏసీ కన్వీనర్ డాక్టర్ వేమూరి శేషగిరిరావు తెలిపారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తెనాలిలో గత 27 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన.. ఈ దీక్షల వల్ల ప్రజల్లో సానుకూల ధోరణి పెరుగుతుండడంతో ఓర్వలేని వైసీపీ నేతలు శిబిరంపై దాడిచేసి పోలీసుల సాయంతో తొలగించారని ఆరోపించారు.

వైసీపీ నేతల దాడిని నిరసిస్తూ రేపు మధ్యాహ్నం జేఏసీ నాయకులను చంద్రబాబు పరామర్శిస్తారని, అనంతరం మునిసిపల్ మార్కెట్ వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ జరుగుతుందని శేషగిరిరావు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమరావతికి సంఘీభావం తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.

More Telugu News