Kerala: కేరళలో సీఏఏను నిరసిస్తూ.. 620 కిలోమీటర్ల మానవ హారం!

  • కేరళలో సీపీఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్ నిరసన
  • తిరువనంతపురంలో పాల్గొన్న సీఎం పినరయి విజయన్  
  • మానవహారంగా సుమారు 60 నుంచి 70 లక్షల మంది

సీఏఏను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కేరళలో 620 కిలోమీటర్ల పొడవునా ప్రజలు మానవ హారంగా ఏర్పడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సుమారు 60 నుంచి 70 లక్షల మంది ఈ మానవహారంలో పాల్గొన్నారు.  ఉత్తర కేరళలోని కసర్ గోడ్ నుంచి దక్షిణంలో చివరనున్న కలియక్కావిలయ్ వరకు ఇది ఏర్పడింది. తిరువనంతపురంలో సీఎం పినరయి విజయన్, సీపీఐ నేత కనమ్ రాజేంద్రన్ ఇతర కూటమి నేతలు మానవహారంలో పాల్గొన్నారు.
 
పాల్గొనడానికి వచ్చిన ప్రజలు ఒక పెద్ద సముద్రాన్ని తలపించారు. ఆదివారం సాయంత్రం చేపట్టిన కార్యక్రమంలో మానవహారంలో పాల్గొన్నవారు రాజ్యాంగంలోని ప్రవేశికను పఠనం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని నినదించారు. సీనియర్ సీపీఎం నేత ఎస్.రామచంద్రన్ పిళ్లై కసర్ గోడ్ వద్ద మానవహారంలో తొలివ్యక్తిగా నిలబడగా, కలియక్కావిలయ్ వద్ద చివరి వ్యక్తిగా ఎంఎ బేబి ఉన్నారు.

More Telugu News