YSRCP: చంద్రబాబు, లోకేశ్ లపై రోజా తీవ్ర విమర్శలు

  • అధికారం కోల్పోయిన బాబుకు అహం మాత్రం తగ్గలేదు
  • ప్రెస్ మీట్లలో చెప్పే బదులు అసెంబ్లీలో చెప్పొచ్చుగా
  • ‘పెద్దలసభ’కు లోకేశ్ లాంటి దద్దోజనాన్ని పంపించారు

అధికారం కోల్పోయినా అహంకారంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ సభ్యురాలు రోజా నిప్పులు చెరిగారు. శాసనమండలి రద్దు తీర్మానంపై చర్చ సందర్భంగా ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ, నిండు సభలో తనను ఎక్కడ నిలదీస్తారోనని భయపడి చంద్రబాబు ఈ రోజున సభకు రాకుండా పారిపోయారని విమర్శించారు. శాసనమండలి రద్దు కుదరదంటున్న చంద్రబాబును తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని.. ‘శాసనమండలి రద్దు కాదని భావించినప్పుడు ఎందుకు పారిపోయారు? ఈ రోజున అక్కడెక్కడో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే మాటలను మీకు దమ్మూధైర్యం ఉంటే ఇక్కడ కూర్చుని మాట్లాడి ఉండొచ్చుగా? అంటూ ప్రశ్నించారు.

శాసనమండలి అంటే ‘పెద్దలసభ’ అని, ఆ సభకు వైసీపీ తరపున ఉన్నవాళ్లందరూ రాజకీయంగా సీనియారిటీ ఉన్నవాళ్లని చెప్పారు. అటువంటి పెద్దల సభకు చంద్రబాబు తమ పార్టీ తరఫున తమ ఇంట్లో ఉన్న దద్దమ్మను, దద్దోజనాన్ని పంపించారంటూ నారా లోకేశ్ పై విసుర్లు విసిరారు. దమ్ముంటే శాసనమండలిని రద్దు చేయమని లోకేశ్ అంటున్నారని.. ‘డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకు వెళ్లి తొడ కొడితే ఏమౌతుంది?.. కూరైపోతుంది’ అన్న విషయాన్ని లోకేశ్ తెలుసుకోవాలంటూ రోజా చురకంటించారు.

More Telugu News