YSRCP: శాసన మండలి వద్దంటూ అప్పట్లో చంద్రబాబు ప్రసంగించిన వీడియోను అసెంబ్లీలో చూపిన ప్రభుత్వం

  • నాటి చంద్రబాబు వ్యాఖ్యలను వినిపించి విమర్శలు గుప్పించిన పేర్ని నాని
  • ప్రతి విషయంలోనూ చంద్రబాబు అడ్డుతగులుతున్నారు
  • జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలను అడ్డుకోవడం సరికాదు

శాసన మండలి వద్దంటూ అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగించిన వీడియోను ఈ రోజు అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ప్రదర్శించింది. వైఎస్సార్ హయాంలో శాసన మండలిని ఏర్పాటు చేస్తూ 2004, జులై8న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దాన్ని వ్యతిరేకించారు. మండలి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి లాభాలూ లేవని ఆయన చెప్పారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించిన అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి చంద్రబాబు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలను అడ్డుకోవడం సరికాదని చెప్పారు.  చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పారు. జగన్ ఆశయాలను చంద్రబాబు, లోకేశ్ అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడడం చంద్రబాబుకు అలవాటు లేదని అన్నారు.

More Telugu News