YSRCP: అందుకే శాసన మండలిని రద్దు చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

  • జగన్, నువ్వు మూర్ఖత్వంతో ముందుకు వెళ్తున్నావు
  • ఏపీని నాశనం చేయాలని  కంకణం కట్టుకున్నావు
  • ఇందుకు శాసనమండలి అడ్డుతగిలిందని దాన్ని రద్దు చేస్తున్నావు 

ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ఆదుర్దాగా అసెంబ్లీలో 'శాసన మండలి రద్దు' తీర్మానాన్ని ప్రవేశపెట్టారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాల్లో ఒక విధానంపై ఎజెండా ఉండేదని చెప్పారు. ముందుగా చెప్పకుండా అప్పటికప్పుడు బీఏసీ సమావేశం ఉందని టీడీపీకి ఫోన్ చేసి చెప్పారని తెలిపారు.

'ఇంతకు ముందు 33 బిల్లులు మండలికి పంపించారు.. మేం వ్యతిరేకించలేదు. వికేంద్రీకరణ బిల్లు
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నందుకే సెలెక్ట్ కమిటీకి పంపాం. దేశంలో కొన్ని రాష్ట్రాల్లోనే శాసన మండళ్లు ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అంటున్నారు. మరి, దేశంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా?' అని ప్రశ్నించారు.
 
'జగన్, నువ్వు మూర్ఖత్వంతో ముందుకు వెళ్తున్నావు. ఏపీని నాశనం చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. ఇందుకు శాసనమండలి అడ్డుతగిలిందని దాన్ని రద్దు చేస్తున్నావు. రాష్ట్రం 42 రోజుల నుంచి అట్టుడుకుతోంది. ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు' అని అచ్చెన్నాయుడు అన్నారు.

More Telugu News