West Bengal: పంతం నెగ్గించుకోబోతున్న మమత... సీఏఏకు వ్యతిరేకంగా నేడు పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో తీర్మానం!

  • తొలి నుంచి పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న దీదీ
  • తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని ప్రకటన
  • బిల్లు అమోదం పొందితే నాలుగో రాష్ట్రం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన పంతం నెగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తొలి నుంచి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న దీదీ అసెంబ్లీలో నేడు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నామని, దీనికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆ రాష్ట్ర మంత్రి పి.చటర్జీ కోరారు. సీఏఏ చట్టానికి పార్లమెంటు ఆమోద ముద్రవేసినప్పటి నుంచి దాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని గట్టిగా చెబుతున్న మమత ఆ మాటకే కట్టుబడి ఉన్నారు.

పైగా సీఏఏకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు బీజేపీయేతర రాష్ట్రాలన్నీ తీర్మానం చేయాలని ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ జాబితాలో ఇది నాలుగో రాష్ట్రం అవుతుంది. ఇప్పటికే కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌ ప్రభుత్వాలు సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానాలు ఆమోదించాయి.

More Telugu News