Pakistan: పాక్ లో హిందూ యువతి వివాహం... కిడ్నాప్ చేసి, మతం మార్పించి, పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడు!

  • సింధ్ రాష్ట్రంలో ఘటన
  • డిసెంబర్ 1నే మతం మారినట్టు ధ్రువపత్రాల సృష్టి
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సమాజం

పాకిస్థాన్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఎటువంటి దాష్టీకాలు జరుగుతూ ఉంటాయనడానికి ఈ ఘటన తాజా ఉదాహరణ. ఓ హిందూ యువతి వివాహం జరుగుతుండగా, ముస్లిమ్ యువకుడు పోలీసుల సాయంతో వచ్చి, ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, మతం మార్చి వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన సింధ్ రాష్ట్రంలోని హాలా పట్టణంలో జరిగింది.

వధువు తండ్రి కిశోర్ దాస్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయన కుమార్తె భారతీ బాయికి మరో హిందూ యువకుడితో పెళ్లిని నిశ్చయించి, వేడుకను జరిపిస్తుండగా, షారుఖ్ గుల్ అనే యువకుడు పోలీసులతో వచ్చి, ఆమెను బలవంతంగా తీసుకెళ్లాడు. ఆపై మతం మార్చి బుష్రాగా పేరు మార్చి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి పేరిట మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా జారీ అయింది. డిసెంబర్ 1వ తేదీన తన కుమార్తె మతం మారినట్టు పత్రాలను సృష్టించారని కిశోర్ దాస్ వెల్లడించారు.

కాగా, ఆమె మతం మార్చుకుని, తనను పెళ్లి చేసుకుందని చెబుతున్న షారుఖ్ గుల్, తన భార్యకు మరో పెళ్లి చేస్తున్న కారణంతోనే పోలీసుల సాయంతో తాను వెళ్లి, ఆమెను తెచ్చుకున్నానని చెబుతున్నాడు. ఇక ఈ ఘటనపై పాకిస్థాన్ లోని హిందూ సమాజం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హిందువులకు భద్రత కల్పిస్తామని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ, ఇటువంటి ఘటనలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News