Yanamala: మండలి రద్దు అయ్యే సమయానికి మెజారిటీ వైసీపీదే కదా?: యనమల ఆసక్తికర వ్యాఖ్యలు!

  • రద్దు కావడానికి మూడేళ్ల సమయం పడుతుంది
  • ఆలోగా మెజారిటీ సభ్యులు వైసీపీ వాళ్లే ఉంటారు
  • రద్దు ఆలోచన జగన్ అవివేకమన్న యనమల

ఆంధ్రప్రదేశ్ మండలిని రద్దు చేయాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని, 2021 నాటికి మండలిలో తెలుగుదేశం బలం తగ్గిపోయి, వైసీపీ నుంచే మెజారిటీ సభ్యులు ఉంటారని ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, మండలిని రద్దు చేయాలని జగన్ ఎందుకంత నిశ్చయంతో ఉన్నారో తెలియడం లేదన్నారు.

ఇప్పటికిప్పుడు శాసన మండలిని రద్దు చేయాలని క్యాబినెట్, అసెంబ్లీ ఆమోదించినా, 2022లోనే రద్దు సాధ్యమవుతుందని అన్నారు. మరోపక, ఇకపై మండలిలో ఖాళీ అయ్యే స్థానాలన్నీ వైసీపీ సొంతం చేసుకుంటుందని అనడంలో సందేహం లేదని, ఎమ్మెల్యేల కోటా సభ్యులను, గవర్నర్ నామినేషన్ సభ్యులను ఆ పార్టీ పొందుతుందని యనమల గుర్తు చేశారు. తమ పార్టీ బలం క్రమంగా పెరిగే సభను రద్దు చేయాలని భావించడం జగన్ అవివేకమని ఎద్దేవా చేశారు.

తమ పార్టీ ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని వైసీపీ నేతలు పలువురికి ఫోన్లు చేసి, ప్రలోభాలకు గురి చేశారని, అయితే, తమ పార్టీ ఎమ్మెల్సీలెవరూ లొంగలేదని ఆయన అన్నారు. మూడు రోజుల పాటు ఈ ప్రలోభాల పర్వం కొనసాగిందని, ఎవరూ మాట వినలేదు కాబట్టే, అక్కసుతో మండలిని రద్దు చేయాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు. ఓ రాజ్యాంగ వ్యవస్థ రద్దు జగన్ అనుకుంటున్నంత సులువు కాదని, ప్రజా వేదికను కూల్చినంత ఈజీగా కౌన్సిల్ ను రద్దు చేయవచ్చని భావిస్తే, అది మూర్ఖత్వమేనని యనమల అభిప్రాయపడ్డారు.

More Telugu News