Budda Venkanna: మండలిని రద్దు చేయలేరు... ఎందుకో మాకు తెలుసు: బుద్దా వెంకన్న

  • బుద్దా వెంకన్న మీడియా సమావేశం
  • వైసీపీవి వట్టి బెదిరింపులేనన్న బుద్దా
  • మండలిని రద్దు చేయరని వెల్లడి

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంగళగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాసనమండలిని రద్దు చేస్తామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు, మొదట మండలి నుంచి మంత్రులుగా నియమితులైన వారితో రాజీనామా చేయించాలని, మండలిలో ఉన్న వైసీపీ సభ్యులతోనూ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. శాసనమండలి రద్దు గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం మాటలు అప్పుడు నమ్ముతామని చెప్పారు. అంతేకాదు, ఇటీవలే కొన్న ఇద్దరు సభ్యులతోనూ రాజీనామా చేయించాల్సిన బాధ్యత వైసీపీ సర్కారుపై ఉందని స్పష్టం చేశారు.

"మొత్తం 11 మందితో రాజీనామా చేయిస్తేనే మీరు మండలిని నిజంగా రద్దు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు. అదేమీ లేకుండా,  ఆ ఇద్దరు మంత్రులను అలాగే ఉంచి, మిగతా ఏడుగురు సభ్యులను అలాగే ఉంచి, పార్టీ ఫిరాయించిన ఇద్దరినీ అలాగే ఉంచి... శాసనమండలిని రద్దు చేస్తామంటే మాత్రం అవి వట్టి బెదిరింపులుగానే భావిస్తాం. మాకు అర్థమైనంతవరకు మీరు మండలిని రద్దు చేయరు. ఎందుకంటే మీకు ఎన్నికల్లో బాగా డబ్బులు ఖర్చుపెట్టిన వాళ్లకు మండలిలో చాన్స్ ఇస్తామని హామీలు ఇచ్చారు. దీన్ని బట్టి మీరు మండలిని రద్దుచేయబోరని బల్లగుద్ది చెబుతున్నా. మీవన్నీ బెదిరింపులే" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News