Chennai: ఇంట్లో దాచిన మద్యం సీసా మాయం.. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి!

  • తీవ్రంగా గాయపడిన సోదరి మృతి
  • చికిత్స పొందుతున్న మరో ఇద్దరు
  • చెన్నైలోని వళసరవాక్కంలో ఘటన

ఇంట్లో పెట్టిన మద్యం సీసా కనిపించలేదన్న కారణంతో కుటుంబ సభ్యులపై కత్తితో దాడిచేశాడో ప్రబుద్ధుడు. అతడి దాడిలో గాయపడిన సోదరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చెన్నైలోని వళసరవాక్కం, వేలన్‌నగర్‌లో జరిగిందీ  ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. తారకేశ్వరి (54), తన తల్లి వేదనాయకి, కుమారుడు ఆదికేశవన్‌తో కలిసి నివసిస్తోంది. శ్రీలంకకు చెందిన ఆమె తమ్ముడు గుగదాసన్ ఇటీవల శబరిమల వెళ్లి అటు నుంచి చెన్నైలోని సోదరి తారకేశ్వరి ఇంటికి వచ్చాడు.

ఈ క్రమంలో ఇంట్లో పెట్టిన మద్యం సీసా కనిపించకపోవడంతో శుక్రవారం రాత్రి సోదరితో గొడవ పడ్డాడు. అది మరింత పెరగడంతో ఆమెపై కత్తితో దాడిచేశాడు. అడ్డుకునేందుకు వచ్చిన వేదనాయకి, ఆదికేశవన్‌పైనా దాడి చేశాడు. వారి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే ఇంట్లోకి వెళ్లి, గాయపడిన ముగ్గురినీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన తారకేశ్వరి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News