Sucide: తన భార్యకు రెండో పెళ్లి చేయాలంటూ తండ్రికి సూసైడ్ నోట్!

  • ఆత్మహత్య చేసుకోవాలని భావించిన బ్యాంకు అధికారి
  • పురుగుల మందు తాగి ఆసుపత్రిలో
  • కేసును విచారిస్తున్న పోలీసులు

ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ బ్యాంకు అధికారి, ఆత్మహత్య చేసుకోవాలని భావించి, సూసైడ్ నోట్ లో భార్యకు మరో వివాహాన్ని జరిపించి, ఆమె ఆనందంగా ఉండేలా చూడాలని తండ్రిని ఉద్దేశించి రాశాడు. రావాల్సిన అప్పులన్నింటినీ వసూలు చేసుకోవాలని సూచించాడు. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లాకు చెందిన చిత్తలూరి శ్రవణ్‌ కుమార్‌, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌ గా పనిచేస్తున్నాడు.

2019లో ఇతనికి సూర్యాపేటకు చెందిన హరిత అనే యువతితో వివాహం జరిగింది. దంపతులు ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. శ్రవణ్ కుమార్ కు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన అతను, పురుగుల మందు తాగగా, దీన్ని గమనించిన హారతి, అతడిని ఆసుపత్రికి తరలించింది. శ్రవణ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కాగా, సూసైడ్ అటెంప్ట్ చేయడానికి ముందు తన తండ్రిని ఉద్దేశించి శ్రవణ్ రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో తాను ఇచ్చిన అప్పులను వసూలు చేసుకోవాలని, అందుకు తన స్నేహితులు సహకరించాలని ఈ లేఖలో శ్రవణ్ కోరాడు. తనకు ఎంతో డబ్బు రావాల్సి వుందని, వాటితో అంత్యక్రియలు చేయాలని, తన భార్యకు రెండో వివాహం చేయాలని కోరాడు. కేసును విచారిస్తున్నామని, అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News