KCR: అన్నగారు రామారావు మద్యనిషేధం తెచ్చారు... అప్పుడూ ఇంతే!: సీఎం కేసీఆర్

  • 94 నాటి రాజకీయాలను గుర్తుచేసుకున్న కేసీఆర్
  • ఎన్నో ఎన్నికలు చూశానన్న తెలంగాణ సీఎం
  • కొన్ని నిర్ణయాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని వెల్లడి

తెలంగాణ సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించడం పట్ల ఆనందంతో పొంగిపోతున్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక మున్సిపల్ ఎన్నికలు చూశానని, సాధారణంగా ఇలాంటి ఫలితాలు రావని అన్నారు. ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని అని తెలిపారు. 1994లో తాను టీడీపీలో ఉన్నప్పుడు అన్నగారు ఎన్టీరామారావుతో కలిసి తిరిగానని, తాము మద్య నిషేధం ప్రకటించామని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రజలు తమను బ్రహ్మాండంగా గెలిపించారని వెల్లడించారు.

అయితే మద్య నిషేధం కారణంగా ప్రభుత్వంపై కొన్నివేల కోట్ల భారం పడిందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో సేల్స్ ట్యాక్స్ పెంచాల్సి వచ్చిందని, ఆపై జరిగిన ఎన్నికల్లో మద్యనిషేధం సంగతి మర్చిపోయిన ప్రజలు సేల్స్ ట్యాక్స్ ను దృష్టిలో పెట్టుకుని తమను ఓడించారని కేసీఆర్ వివరించారు. రాజీవ్ గాంధీ మరణం సమయంలోనూ ఘనవిజయం సాధించిన తాను, సేల్స్ ట్యాక్స్ దెబ్బకు సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని చెప్పారు. కొన్ని నిర్ణయాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు.

More Telugu News