Sivanathareddy: వైఎస్ కుటుంబం అంటే చాలా అభిమానం.. అందుకే ఓటేశా: ఎమ్మెల్సీ శివనాథరెడ్డి

  • మండలిలో ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసిన శివనాథరెడ్డి
  • టీడీపీ విప్ ధిక్కరించిన ఎమ్మెల్సీ
  • వైసీపీలో కొనసాగుతానని వెల్లడి!

శాసనమండలిలో ప్రభుత్వానికి అనుకూలం ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. రూల్ నెం.71 అంశంలో ఓటింగ్ నిర్వహించినప్పుడు శివనాథరెడ్డి, పోతుల సునీత టీడీపీ విప్ ను ధిక్కరించి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. తాజాగా, శివనాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పారు.

ఆ ఉద్దేశంతోనే రూల్ నెం.71 విషయంలో తమకు అనుకూలంగా ఓటేయాలని వైసీపీ వాళ్లు అడిగారని, వైఎస్ కుటుంబంపై అభిమానంతో ఓటేశానని తెలిపారు. తాను గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నానని, అయితే టీడీపీ టికెట్ ఇచ్చిందని వెల్లడించారు. ఇకపై వైసీపీలో కొనసాగుతానని అన్నారు. అటు, తమ విప్ ధిక్కరించిన శివనాథరెడ్డి, పోతుల సునీతలపై వేటు వేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

More Telugu News